సినిమా ఆడియన్స్లో చాలా మంది సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి వారికి విందు భోజనం పెట్టడానికి వచ్చేస్తోంది కుమారి. అదేనండీ కుమారి21F సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హెబ్బా పటేల్. ప్రస్తుతం ఈ వయ్యారి భామ మిస్టరీ థ్రిల్లర్ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రామ్ కార్తిక్, హెబ్బా పటేల్ కీలక పాత్రల్లో నటించిన మిస్టరీ థ్రిల్లర్ ‘ది గ్రేట్ ఇండియన్ సూసైడ్’. వెన్నులో వణుకుపుట్టించే సన్నివేశాలతో ఉత్కంఠభరితమైన థ్రిల్లర్గా రూపుదిద్దుకున్న ఈ సినిమాను డైరెక్ట్గా ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది.
అక్టోబర్ 6న ఈ చిత్రం ‘ఆహా’ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా ఓటీటీ వారు అధికారికంగా ప్రకటించారు. ‘కళ్లను కప్పేసిన మూఢనమ్మకం.. నమ్మకంతో రాసుకున్న మరణశాసనం’ అంటూ సోషల్ మీడియాలో వారు విడుదల చేసిన పోస్టర్కు క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టర్ను చూస్తే కాస్త వెన్నులో వణుకు పుడుతోంది. ఈ పోస్టర్ను చూస్తుంటే ఈ సినిమాలో హెబ్బా భయపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ సినిమాలో నరేష్ వీకే, పవిత్రా లోకేష్, జయప్రకాష్ ఈ మూవీలో కీలక పాత్రల్లో నటించారు. ఈ మిస్టరీ థ్రిల్లర్ను విప్లవ్ కోనేటి డైరెక్ట్ చేయడంతో పాటు ఆయనే స్వయంగా నిర్మించారు. కథ విషయానికి వస్తే ’మదనపల్లి అనే ఊరిలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటుంది.
అయితే ఆ కుటుంబం ఆత్మహత్యకు ఎందుకు పాల్పడాలనుకుంది? పునర్జన్మలపై వారికి నమ్మకం ఉందా? మళ్లీ పుడతారని ఆ కుటుంబం ఎందుకు నమ్మిందనే పాయింట్తో ఈ సినిమా రానుంది.ఎమోషనల్ డ్రామా, మనసును తాకే థ్రిల్స్, అనూహ్యమైన రొమాన్స్, అన్నిటి మేళవింపుగా అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని మేకర్స్ చెబుతున్నారు. వెన్నులో వణుకుపుట్టించే సన్నివేశాలు ఇందులో పుష్కలంగా ఉంటాయని దర్శకనిర్మాత విప్లవ్ కోనేటి తెలుపుతున్నారు.
హెబ్బా పటేల్ విషయానికి వస్తే ఇటీవల ఆమె నటించిన సినిమా ‘ఓదెల రైల్వే స్టేషన్’ ఆహాలోనే విడుదలై మంచి క్రైమ్ థ్రిల్లర్గా ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ‘ది గ్రేట్ ఇండియన్ సూసైడ్’తో మళ్లీ ఆహా ప్రేక్షకులను హెబ్బా పలకరించనుంది. రీసెంట్గా వచ్చిన ‘మళ్ళీ పెళ్లి’తో ఆహా ఆడియన్స్ను అలరించిన నరేష్ వీకే, పవిత్రా లోకేష్ మరోసారి ఈ ‘ది గ్రేట్ ఇండియన్ సూసైడ్’లో భార్యభర్తలుగా కనిపించనున్నారు. ఆడియన్స్ను భయపెట్టడానికి రెడీ అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగా భయపెడుతుందో చూడాలంటే అక్టోబర్ 6 వరకు వేచిచూడాల్సిందే.
హెబ్బా పటేల్ ఇప్పటి వరకు 16 సినిమాల్లో నటించింది. 2014లో వచ్చిన తిరుమనం ఎనుం నిఖా అనే తమిళ సినిమాతో సినీరంగంలోకి ప్రవేశించింది. తెలుగులో 2014లో వచ్చని అలా ఎలా? అనే చిత్రంతో తెలుగు తెరకు పరిచమైంది ఈ బ్యూటీ. 2015లో వచ్చిన కుమారి 21ఎఫ్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకుంది. అప్పటి నుంచి సంవత్సరానికి ఒకటీ, రెండు సినిమాల్లో నటిస్తున్నా మిశ్రమ ఫలితాలనే అందుకుంటోంది. OTTలోకి డైరెక్ట్ వస్తున్న ‘ది గ్రేట్ ఇండియన్ సూసైడ్’పై హెబ్బా అన్ని ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంటే హెబ్బాకు మరన్ని చాన్సులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.