Monday, July 1, 2024

Siddharth : నా సినిమా ఎవరు చూస్తారు.. స్టేజీపైనే కంటతడి పెట్టిన సిద్ధార్థ్

ప్రముఖ నటుడు సిద్ధార్థ్ నటించిన ‘చిట్టా’ (కన్నడలో చిక్కు) ఇటీవల విడుదలై మంచి సమీక్షలను అందుకుంది. అయితే సినిమా ప్రమోషన్ కోసం సిద్ధార్థ్ బెంగుళూరు వెళ్లినప్పుడు అక్కడ కొందరు ఆయన విలేకరుల సమావేశాన్ని ఆపేశారు. అనంతరం నటుడు ప్రకాష్ రాయ్, శివరాజ్ కుమార్ సిద్ధార్థ్‌కు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. చిట్టా సినిమా కార్యక్రమంలో బెంగళూరులో జరిగిన సంఘటనను ఇప్పుడు సిద్ధార్థ్ గుర్తు చేసుకున్నారు.

తెలుగులో ‘చిన్నా’గా వస్తుందీ సినిమా. కాస్త ఆలస్యంగా విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్ కార్యక్రమంలో సిద్ధార్థ్ ఎమోషనల్‌ అయ్యాడు. ‘బెంగళూరులో జరిగిన ప్రెస్‌మీట్‌లో నువ్వు తమిళుడివి, గెటౌట్‌ అని అన్నారు. ఒక నటుడిగా భాష నేర్చుకుని మరీ వెళ్లాను. తరువాత కొందరు క్షమించమని అడిగారు, కృతజ్ఞతలు చెప్పారు. ఎందుకు అలా అన్నారో నాకు తెలియదు. కానీ నిర్మాతగా, నటుడిగా సినిమా గురించి మాట్లాడనివ్వలేదు.’ అని బాధగా చెప్పాడు.

‘తమిళంలో రెడ్ జాయింట్ మా సినిమా చూసి, ఇలాంటి సినిమా ఎప్పుడూ చూడలేదని రైట్స్ కొన్నారు. మలయాళంలో కూడా గోకులం గోపాలన్ నా 55 ఏళ్ల కెరీర్‌లో ఇలాంటి సినిమా చూడలేదు అంటూ నా సినిమాను కొన్నారు. తెలుగులో ‘కేజీఎఫ్’ చిత్రాన్ని తీసుకున్న టీమ్ నా చిత్రాన్ని కొనుగోలు చేసింది. తెలుగులో సిద్ధార్థ్ సినిమాను ఎవరు చూస్తారని థియేటర్లు ఇవ్వలేదు.’ అంటూ వేదికపైనే సిద్ధార్థ్ కంటతడి పెట్టారు.

‘బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను ఇక్కడ అందించారు. అలాగే నేను చేసిన సినిమాల్లో ఇదే బెస్ట్ సినిమా. నేను ఇంతకంటే మంచి సినిమా తీయలేను. నేను మంచి సినిమా తీస్తే జనాలు చూస్తారనే నమ్మకం ఉంది. అన్నాడు సిద్ధార్థ్.

ఈ చిత్రాన్ని తెలుగులో సెప్టెంబర్ 28న విడుదల చేయాలని భావించారు. అయితే సిద్ధార్థ్ సినిమా ఎవరు చూస్తారు అని కొందరు చెప్పడంతో నాకు థియేటర్లు సరిగా రాలేదని బాధపడ్డాడు. నేను మీతో ఉన్నానని ఏషియన్ సినిమా సునీల్ నాతో నిలబడ్డారని చెప్పుకొచ్చాడు.

మీకు సినిమాలంటే ఇష్టమైతే, మంచి సినిమాలు చూడటం ఇష్టం ఉంటే నా సినిమా చూడండని సిద్ధార్థ్ కోరాడు. సిద్ధార్థ్ సినిమాని తెలుగులో ఎందుకు చూడాలనుకుంటే సినిమా చూడకండి అని క్లారిటీ ఇచ్చాడు. నేనూ ఇక సినిమా తీయనని ఎమోషనల్ గా చెప్పాడు.

Related Articles

Latest Articles

You cannot copy content of this page