యంగ్ హీరో నవీన్పొలిశెట్టి, హీరోయిన్ అనుష్క నటించిన ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’ సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. నవీన్ పొలిశెట్టి, అనుష్క నటించిన ఈ సినిమాను ఇద్దరికీ ముఖ్యమైన ప్రాజెక్టు. ఎందుకంటే.. 2021లో ‘జాతిరత్నాలు’ సినిమా తర్వాత నవీన్ పొలిశెట్టి, 2020లో ‘నిశ్శబ్ధం’ సినిమా తర్వాత అనుష్క చాలా గ్యాప్ తర్వాత తీశారు. దీంతో వీరి అభిమానులంతా ఈ సినిమా కోసం వెయిట్ చేశారు.
ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను ‘కృష్ణాష్టమి’ సందర్భంగా సెప్టెంబర్ 7వ తేదీన విడుదలై సూపర్ హిట్ అయింది. అయితే..వీరిద్దరూ వారివారి తర్వాత సినిమాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అనుష్క మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. రజిన్ థామస్ దర్శకత్వంలో ‘కథనార్ – ది వైల్డ్ సోర్సెరర్’ అనే సినిమాలో జేజమ్మ నటిస్తోంది. ఫాంటసీ హారర్ డ్రామాగా వస్తున్న కథనార్ సినిమా అరుంధతి సినిమా తరహాలో ఉండనున్నట్లు సమాచారం.
ఓ కేరళ పూజారి కడమత్తత్తు కథనార్ కథల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో జాతీయ అవార్డ్ అందుకున్న మలయాళ స్టార్ హీరో జయసూర్య ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా తాజాగా కథనార్ గ్లింప్స్ను విడుదల చేశారు. ఈ మూవీని మొత్తం 14 భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇక నవీన్ పొలిశెట్టి జాతిరత్నాలు సినిమాతో టాలీవుడ్లో తనకంటూ ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ను క్రియేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఎవరూ ఊహించని విధంగా దేవసేనతో ‘మిస్శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాను ప్రకటించి ఫ్యాన్స్ను సర్ప్రైజ్ చేశాడు. ఆ సినిమా హిట్ అవడంతో ఈ యంగ్ హీరో ఫుల్ జోష్లో ఉన్నాడు.
అనుష్కతో సినిమాకు ముందే ‘అనగనగా ఒక రాజు’ అనే సినిమాలో నటించాడు నవీన్. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ కంటే ముందే చిత్రీకరించారు. అయితే ఈ మూవీ విడుదలకు నోచుకోలేదు. దీంతో నవీన్ పోలిశెట్టి సంశయంలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా విడుదలపై ఈ హీరో దృష్టి పెట్టినట్లు సమాచారం. ఏడాది కిందట సినిమా తాలుకూ టైటిల్ టీజర్ను కూడా రిలీజ్ చేశాడు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమా షూటింగ్ కొంత జరుపుకున్న తర్వాత అవుట్ పుట్ విషయంలో నవీన్ ఆలోచనల్లో ఉన్నాడట. దాంతో దర్శకుడిని మార్చినట్లు సమాచారం. ముందుగా ఈ సినిమాకు కళ్యాణ్ శంకర్ దర్శకుడు. కానీ ఇప్పుడీ సినిమా ఆ దర్శకుడి చేతిలో లేదని ఇన్సైడ్ టాక్. వీలైనంత త్వరగా కొత్త దర్శకుడిని ఈ ప్రాజెక్ట్లోకి స్వాగతించాలని మేకర్స్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. నెల రోజుల వ్యవధిలోనే ఓటీటీలోకి రానుంది. అక్టోబర్ 5 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో మిస్ అయినవారికి ఇది గుడ్న్యూస్ అని చెప్పవచ్చు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి పి.మహేష్ బాబు దర్శకత్వం వహించగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మించారు. ఈ సినిమా థియేటర్లలో విడుదలై మంచి టాక్నే సొంతం చేసుకుంది. ముఖ్యంగా నవీన్ కామెడీ టైమింగ్, అనుష్క నటనకు మంచి మార్కులే పడ్డాయి. మరి ఓటీటీ ప్రేక్షకులను ఏ మేరకు ఈ సినిమా అలరిస్తుందో చూడాలి.